#SaveHCU – అభివృద్దా? అణచివేతనా? లేక చట్టమా? మానవత్వమా?

టి. సందీప్


గత వారం రోజులుగా #SaveHCU పేరిట హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులు చేస్తున్న నిరసనలు దానికి సామజిక మాధ్యమాలలో వస్తున్న మద్దతు మీలో చాలామందికి విదితమే. దీని పైన ఇటు స్టూడెంట్స్ అటు ప్రభుత్వం మధ్యలో సామజిక – రాజకీయ వేత్తల మాటల యుద్ధం నడుస్తున్న వేళ.. ఈ సమస్యకు మూలం, వర్తమానం, భవిష్యత్తు గురించి నేను సూచించిన మార్గాలు ఈ క్రింద మీ కోసం..

1969 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ.. ఆ తరువాత 1971-72లలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమాల తరువాత ఏర్పాటు చేసిన సిక్స్ పాయింట్ ఫార్ములా లో భాగంగా అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చొరవతో ఏర్పాటైనదే ఇప్పటికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. 1975లో ఇందుకు సంబంధించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 2300 ఎకరాలు యూనివర్సిటీకి కేటాయిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. సరిగ్గా ఇక్కడే ఇప్పుడు జరుగుతున్న వివాదానికి భీజం పడింది.

అదేంటంటే.. ఆ 2300 ఎకరాలకి సంబంధించిన యూనివర్సిటీకి భూబదలాయింపు జరిగినట్లుగా చేసే మ్యుటేషన్ లో కొన్ని లోపాలు జరిగాయి. ఈ టెక్నీకల్ మిస్టేక్ కారణంగా 2300 ఎకరాలలో కొన్ని వందల ఎకరాలు ఇప్పటికీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ పేరిట రిజిస్టర్ కాలేదు.. (ఇప్పటికీ కూడా ఇది జరగలేదు)..

2003లో ఈ విషయం అప్పటి ప్రభుత్వం దృష్టిలోకి రాగా.. స్పోర్ట్స్ మ్యానేజ్మెంట్ సంస్థ అయిన IMG భరత్ కి స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయిన 400 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇక ఆ భూమి కేటాయించి మూడు యేండ్లు గడిచినా అక్కడ ఎటువంటి నిర్మాణం లేదా అభివృధి జరగకపోవడంతో… IMG భరత కంపెనీ నుండి ఆ 400 ఎకరాలు వెనక్కి తీసుకుంటున్నట్లుగా అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సదరు కంపెనీ కోర్టు ని ఆశ్రయించగా.. ఈ అంశం పైన సుదీర్ఘ విచారణ తరువాత 2024లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తన తీర్పుని వెలువరించింది.

ఎప్పుడైతే ప్రభుత్వానికే ఈ 400 ఎకరాలు చెందుతాయి అన్న తీర్పు వచ్చిందో.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను TGIICకి బదలాయించి.. ఆ తరువాత వాటిని వేలం వేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయాన్ని అసెంబ్లీయే వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించిన కొన్ని రోజులకే జెసిబీ లతో సదరు 400 ఎకరాలను చదును చేసే పనిని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ పని జరిగే క్రమంలో అక్కడ ఉండే పక్షుల హాహాకారాలు చేస్తున్న ఆడియోలు ఇప్పుడు సామజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.

ఈ పరిణామాలతో HCU విద్యార్థులు నిరసనలకు దిగడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ నాలుగు వందల ఎకరాలలో అనేక రకాల వృక్ష సంపదతో పాటుగా మరెన్నో రకాల పశుసంపద కూడా ఉన్నట్లు.. పైగా ఈ 400 ఎకరాలు హైదరాబాద్ నగరానికి ఒక పెద్ద లంగ్ స్పేస్ అని.. దానిని ధ్వంసం చేయొద్దు అని అనేకరకాల నిరసనలు తెలియచేయడం… వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం కూడా ఇప్పుడు వివాదస్పదమైంది.

అయితే ప్రభుత్వం ఈ వివాదం పైన స్పందిస్తూ.. మేము కేవలం ప్రభుత్వ భూమిని మాత్రమే వేలం వేస్తున్నాము.. అంతకుమించి HCUకి చెందిన ఒక్క గజం భూమిని కూడా మేము తీసుకోవడం లేదు అంటూ.. టెక్నీకల్ గా ఈ భూమి ప్రభుత్వానికే చెందింది అని డాక్యుమెంట్లను విడుదల చేశారు. అయినా ఈ భూమిని మేము ఆక్షన్ చేస్తే.. ప్రభుత్వానికి ఆదాయంతో పాటుగా ఆ స్థలంలో ఏర్పాటయ్యే IT పార్క్స్ లలో భవిష్యత్తులో మన రాష్ట్ర యువతకే ఉద్యోగ అవకాశాలు వస్తాయని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. తమ ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడం అభివృధిని అడ్డుకోవడమే అని చెబుతున్నది.

మరోవైపు ప్రకృతి ప్రేమికులు, జంతు ప్రేమికులు, విద్యార్థులు, సామజికవేత్తలు .. ఆ నాలుగు వందల ఎకరాల కారణంగా అక్కడ ఒక ఏకో బ్యాలెన్స్ ఏర్పడింది. దానిని విధ్వంసం చేస్తే.. అది రాబోయే రోజుల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది అన్నది వాళ్ళ వాదన. అలాగే ఈ నాలుగు వందల ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వమని.. ఇవ్వలేని పరిస్థితుల్లో దీనిని ఒక వైల్డ్ లైఫ్ పార్క్ గా డెవలప్ చేయండి అని వారు ఆందోళన చేస్తున్నారు.

ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఆ నాలుగు వందల ఎకరాల భూమి చుట్టూ ఒక పీఠ ముడి పడినట్లుగా అయింది. ఇక కోర్టులో ఈ వివాదం నడుస్తున్న 18 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ స్థలం మాది అని HCU అధికారులు ఒక్క ఇంప్లీడ్ పిటీషన్ వేసినా కూడా ఇప్పుడు టెక్నీకల్ గా HCU కి అన్ని హక్కులు ఉండేవి. కానీ అది జరగలేదు.

అయితే ఈ వివాదానికి పరిష్కారానికి నేను సూచించే మార్గాలు ఇవే –

  • ప్రభుత్వం టెక్నీకల్ గా ఈ భూమి ఎవరిది అని చూడకుండా.. మొత్తాన్ని HCUకి బదలాయించడం.
  • ఈ నాలుగు వందల ఎకరాల భూమిలో ఎంత మేరకు biodiversityకి కేటాయించవచ్చో అనే దాని పైన ఒక కమిటీ వేసి.. దానికనుగుణంగా భూ వేలానికి సిద్దపడవచు.
  • 400 ఎకరాలను చెరి 200 ఎకరాలుగా విభజించి ఇటు ప్రభుత్వం అటు HCUలు మధ్యే మార్గంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ముఖ్య సూచన –

కొన్ని అంశాలను ప్రభుత్వాలు టెక్నీకల్ గా చూడకుండా కాస్త మనసుతో కూడా చూసే ప్రయత్నం చేయాలి. యూనివర్సిటీ చేసిన పొరపాటుని సుప్రీమ్ కోర్టు వరకు వెళ్లి కొట్లాడి ఉచితంగా ప్రయివేట్ వ్యక్తుల పాలు కాకుండా భూమిని సాధించడంలో మీరు చూపిన ప్రతిభ, తెగువను.. అదే భూమి కోసం దానికి టెక్నీకల్ పేరిట ఇప్పుడు వేలం వేయాలనుకోవడం సమంజసం కాదు.

ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు తమకు కేటాయించిన భూమి మొత్తం తమ యూనివర్సిటీల పేరిట ఉందా లేదా అని సరి చూసుకోవడం ముఖ్యం.. జనాభా పెరగడం తద్వారా పెరుగుతున్న వ్యయాలు, అవసరాల దృష్ట్యా భూమి యొక్క విలువ పెరగడం సహజం.. అందుకే భూమి పట్ల జాగ్రత్త అవసరం.

* * *

Scroll to Top